భారీ బడ్జెట్‌కు టీటీడీ గ్రీన్ సిగ్నల్.. రూ. 5,456 కోట్లతో శ్రీవారి వార్షిక సేవా ప్రణాళిక!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశంలో కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 5,456.26 కోట్ల భారీ వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ఆదాయ మార్గాలను పెంచుకుంటూనే.. విద్య.. భద్రత.. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను భారీగా కేటాయించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ. 1,880 కోట్లు.. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 650 కోట్లు.. దర్శనాల ద్వారా మరో రూ. 310 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. వివిధ బ్యాంకుల వడ్డీల రూపంలోనే టీటీడీకి రూ. 1,205 కోట్లు వస్తాయని బడ్జెట్ గణాంకాలు పేర్కొంటున్నాయి.

బడ్జెట్ కేటాయింపుల్లో టీటీడీ ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ. 1,889 కోట్లు.. ఇంజినీరింగ్ విభాగ పనులకు రూ. 475 కోట్లు కేటాయించారు. విద్యా రంగానికి ఈసారి ప్రాధాన్యత ఇస్తూ విద్యాశాఖకు రూ. 201 కోట్లు.. టీటీడీ పరిధిలోని విద్యా సంస్థల నిర్వహణకు అదనంగా రూ. 118 కోట్లు కేటాయిస్తూ బోర్డు తీర్మానించింది. తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కొత్తగా 726 మంది సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. తిరుపతిలో భద్రతా వ్యవస్థ పర్యవేక్షణ కోసం రూ. 10.20 కోట్లతో అత్యాధునిక ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు.

భక్తుల విజ్ఞప్తిని మన్నిస్తూ విరాళాల ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘శ్రీవారి ముడుపు’ పథకాన్ని అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో రూ. 120 కోట్లతో అత్యంత ఆధునిక వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థకు అనుమతులు మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంలో పారదర్శకత కోసం విధివిధానాల్లో మార్పులు చేస్తూ తీర్మానం చేశారు. గోశాలల ఆధునికీకరణ కోసం రూ. 11.82 కోట్లు కేటాయిస్తూ.. గోసంరక్షణకు తమ నిబద్ధతను చాటుకున్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో భాగంగా కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయ సమీపంలో రూ. 21.07 కోట్లతో జాంబవంతుడి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒంటిమిట్ట ఆలయ కల్యాణోత్సవానికి వచ్చే భక్తులందరికీ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయాలని బోర్డు ఆదేశించింది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నూతనంగా సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. వసతులు.. కల్యాణ మండపాల ద్వారా వచ్చే రూ. 173 కోట్లు.. తలనీలాల ద్వారా లభించే రూ. 175 కోట్లను భక్తుల సేవలకే ఖర్చు చేయనున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top