రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే!.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆకాంక్షించారు. గత పదేళ్ల యూపీఏ పాలనలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీల మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ సామాన్యుడి పక్షాన నిలిచింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి కల్పించి.. వారిని ఆర్థికంగా ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ సొంతం. అలాగే, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని (RTI) తీసుకొచ్చి, ప్రజలకు జవాబుదారీతనాన్ని కల్పించిన ఘనత కూడా వారిదే అన్నారు.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఇచ్చిన గొప్ప మనసు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో IIT హైదరాబాద్‌ను సంగారెడ్డిలో ఏర్పాటు చేయడంలో కూడా వారి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ డ్యామ్, ఇక్రిశాట్ (ICRISAT), BHEL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ , BDL, IDPL వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పింది రాహుల్ గాంధీ ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ , నాయనమ్మ ఇందిరా గాంధీలేనని ఆయన గుర్తు చేశారు.

దేశ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని.. నేడు మనం చూస్తున్న ఐటి (IT) విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ టెక్నాలజీకి బీజం వేసింది ఆనాటి టెలికాం విప్లవమేనని.. ఈ అభివృద్ధి ఫలాలను నేటి తరం యువత అనుభవిస్తోందని, భవిష్యత్తులో దేశం ఉద్యోగ, వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో మరింత వృద్ధి చెందాలంటే అది రాహుల్ గాంధీతోనే సాధ్యమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top